ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా.. రాష్ట్ర ప్రజలకు అవినీతి రహిత పాలన అందించడం కోసం తెరాస ప్రభుత్వం అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగా.. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత భారీగా.. పరిపాలన వికేంద్రీకరణ జరిగినా.. అవినీతి రహిత పాలన అందించి, ఆశించిన ఫలితాలను ప్రజలకు అందించడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమైంది.
గతంలో కొత్త పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చి కొంతవరకు అవినీతి రహిత పాలనను అందించే ప్రయత్నం చేసింది. ఈసారి తెరాస ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చట్టం ద్వారా రెవిన్యూ కార్యాలయాలలో, మున్సిపాలిటీల్లో, గ్రామా పంచాయితీలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, డబ్బులు ఇవ్వకుండా.. కావాల్సిన పనులు జరగాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలో భూ వ్యవహారాలను పర్యవేక్షించే.. జాయింట్ కలెక్టర్ (జేసీ) పోస్టును రద్దు చేసి, ఆ స్థానంలో 33 జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించింది. 49 మంది నాన్ కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో తెచ్చిన పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాల వల్ల ప్రజలకు ఒరిగిందేమి లేదు. మరి ఈ కొత్త రెవిన్యూ చట్టం వల్ల ప్రజలు ఎంతవరకు లాభపడతారో వేచి చూడాలి…