తెలంగాణలో కరోనా వ్యాప్తి కట్టడికోసం వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం చేస్తున్న కృషిపై కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా ప్రచారంచేస్తున్నాయని వైద్యశాఖ అధికారులు, నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా వైద్యంచేసే సామర్థ్యం ప్రభుత్వ దవాఖానలకు ఉన్నదని తెలిపారు.
ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు దుష్ప్రచారంచేసి ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రచారం వెనుక కుట్ర ఉన్నదని కూడా అనుమానం వ్యక్తంచేశారు. రెండువేల మందికి పైగా చికిత్సను అందించగలిగే సామర్థ్యం కలిగిన గాంధీ దవాఖానలో 247 మంది మాత్రమే వైరస్ సోకినవారున్నారని చెప్పారు. వాస్తవం ఇదైతే కొందరు పనిగట్టుకొని గాంధీ దవాఖాన రోగులతో కిక్కిరిసిపోయిందని ప్రచారంచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరు నిరంతరం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తుండటంతో రోజూ కోర్టుకు తిరుగాల్సి వస్తున్నదని, దీనివల్ల వైద్యసేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.