ఇండియా, పాకిస్తాన్ దాయాది దేశాలు. ఎప్పుడు గొడవలే ఉంటాయి. ప్రతి విషయానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని తామే నెగ్గాలని భావిస్తుంటాయి. కాశ్మీర్ విషయంలో గత 70 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాయి. జల వివాదాల కారణంగా కూడా తగాదాలు రగులుతూనే ఉన్నాయి. ఇటీవల మరో కొత్త వివాదం తెరమీదకొచ్చింది. రెండు దేశాల మధ్య కుంపటి రాజేస్తోంది. బాస్మతి బియ్యంపై జియోగ్రాఫిక్ ఇండికేషన్ హోదా కోసం భారత్ దరఖాస్తు చేసుకోవడంతో పాకిస్తాన్ మండిపడుతోంది.
భారత ఉప ఖండంలో వందల సంవత్సరాలుగా సాగు అవుతున్న బాస్మతి బియ్యం, భారత్ తోపాటు పాకిస్తాన్ కు కూడా ఎగుమతుల రూపంలో గణనీయమైన ఆదాయాన్ని చాలా సంవత్సరాలుగా తీసుకొస్తోంది. గణాంకాల ప్రకారం భారత దేశానికి ఏటా సుమారు 7 బిలియన్ డార్లను బాస్మతి ఎగుమతుల ద్వారా సంపాదించి పెడుతోంది.
పాకిస్తాన్ కూడా సుమారు2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని బాస్మతి ఎగుమతుల ద్వారా రాబడుతోంది. ఇందులో సింహభాగం యూరోపియన్ యూనియన్ నుంచే రెండు దేశాలకు వస్తోంది. దీనికి ప్రధాన కారణం 2006 సంవత్సరంలో యూనియన్ పాకిస్తాన్, భారత్ దేశాల నుంచి వచ్చే బాస్మతి బియ్యంపై జీరో టారిఫ్ వెసులుబాటు ఇవ్వడమే. యూరోపియన్ యూనియన్ లోకి వచ్చే బాస్మతిలో మూడింట రెండు వంతులు కేవలం భారత్, పాకిస్తాన్ నుంచే వెళుతోంది.
యూరోపియన్ యూనియన్ లోకి ఇటీవల కాలంలో పాకిస్తాన్ నుంచి వెళ్లే బాస్మతి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2017లో 120 మెట్రిక్ టన్నులు, 2019లో 3 లక్షల మెట్రిక్ టన్నులు పాక్ నుంచి ఎగుమతి అయ్యాయి. భారత్ బాస్మతిపై జియోగ్రాఫిక్ ఇండికేషన్ హోదా కోసం యూరోపియన్ యూనియన్ కి దరఖాస్తు చేసుకుంది. ఇది పాకిస్తాన్ కు సహజంగానే ఆగ్రహం తెప్పించింది. జియోగ్రాఫిక్ ఇండికేషన్ ఖరారు అయితే మిగతా ఉత్పత్తులు ఆ ప్రాంతంలో మార్కెట్ చేసుకోవడానికి వీలు పడదు. దీనికి పాకిస్తాన్ కూడా దీటుగా స్పందిస్తోంది.