ఏపీ రాజధానిగా అమరావతి అనే నినాదాన్ని ప్రజల్లో నుంచి పూర్తిగా తుడిచిపరేయాలని ప్రయత్నిస్తున్నారు జగన్. ఇందుకు ప్రధానంగా కులాన్నే ప్రధానంగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుల ప్రస్తావన చేయడానికి ఏ మాత్రం సందేహపడకుండా ముందుకెళ్లిపోతున్నారు. నిన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన రాజధాని ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతికి రైతులు ఇచ్చిన భూములను సీడ్ క్యాపిటల్గా కట్టాల్సిన భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి బయట ప్రాంతాల వారికి ఇవ్వాలనుకున్నారు.
Also Read: తిరుపతి చేరుకున్న టీడీపీ వ్యూహకర్త
రైతులు కోర్టుకెళ్లడంతో నిలిచిపోయింది. రైతులు న్యాయం కోసమే కోర్టుకెళ్లారు. కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇంటి పట్టాలిస్తే కులాలు మారిపోతాయని కోర్టుకెళ్లారని నిర్మోహమాటంగా చెబుతున్నారు. కులాలు మారిపోతాయని ఇంటిపట్టాలివ్వొద్దంటున్నారని.. అన్ని కులాలు, మతాలు కలసి ఉంటేనే సమాజమని ఆయన హితవు చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు విని మొదట చాలా మందికి అర్థం కాలేదు కానీ.. కులం ముద్ర వేసే సరికి.. అది అమరావతేనని అందరికీ అర్థమైపోయింది. అమరావతిపై కులం ముద్ర వేయడానికి వైసీపీ చాలా పకడ్బందీగా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ప్రణాళికలు వేసింది.
కానీ.. అక్కడ భూములిచ్చిన వారిలో ఎక్కువ మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. సీఎం జగన్ చెబుతున్న సామాజికవర్గం కన్నా రెడ్లే రెండింతల వరకూ భూములిచ్చారని లెక్కలు బయటకు వచ్చాయి. అమరావతి జేఏసీ కన్వీనర్గా శివారెడ్డి ముందుండి పోరాడుతున్నారు. అయిన్పపటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిపై అంటరాని ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కులాలు మారిపోతాయని.. అక్కడ పట్టాలివ్వడం లేదని.. అందుకు కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని చెబుతున్నారు.
Also Read: జగనన్న ఇల్లు ఎంతో తెలుసా..?
ఇప్పటివరకూ అమరావతిని రాజధానిగా తొలగించేందుకు అనేకానేక కారణాలను వైసీపీతోపాటు ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. చంద్రబాబు బినామీ ఆస్తుల దగ్గర్నుంచి అమరావతి మునిగిపోతుందన్న వరకూ చాలాచాలా చెప్పారు. అవినీతి ప్రచారం చేశారు. ఆ కారణాలను చెప్పి అమరావతిని తరలించాలని అనుకున్నారు. కానీ.. ఏ ఒక్క కారణాన్ని కూడా సహేతుకంగా ప్రజల ముందు ఉంచలేకపోయారు. ఇప్పుడు జగన్పై మరో విధమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అమరావతి విషయంలో ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని.. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే అంటరాని ముద్ర వేస్తున్నారని మండిపడుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్