2018-19 సమయంలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగారు నాటి ఏపీ సీఎం చంద్రబాబు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీ వైఖరిని నిరసనగా కాంగ్రెస్ తో జట్టుకట్టారు. ఆ ఏడాది కాలంలో నరేంద్రమోడీతో తీవ్రంగా బహిరంగంగా ఘర్షణకు దిగారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ ఆదేశాలను చంద్రబాబు ధిక్కరించారు. కాలదన్నారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. ఏపీలో రాజకీయ నాయకులపైనే కాదు.. అఖిల భారత ఐఏఎష్ అధికారులపై కూడా కేసులను దర్యాప్తు చేయడానికి నాటి సీఎం చంద్రబాబు కేంద్రంలోని సీబీఐకి అనుమతి ఇవ్వలేదు. సీబీఐని ఏపీలో అడుగు పెట్టనీయకుండా నిషేధించారు. ఘర్షణకు దిగారు.
నాడు మోడీపై ఇదే సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికే సీబీఐ వంటి ఏజెన్సీలను కేంద్రం దుర్వినియోగం చేసిందని.. ఫలితంగా సీబీఐకి ఏపీలో ఏ కేసును అప్పగించమని.. సీబీఐని ఏపీలో అడుగపెట్టనీయమని నిషేధించారు చంద్రబాబు.
కానీ 2019లో చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ట్రైయిన్ రివర్స్ అయ్యింది. చంద్రబాబు బీజేపీని ఎదురించి ఓడిపోయారు. అదే సమయంలో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.
ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రతీ సమస్యపై సీబీఐ విచారణను కోరుతున్నారు. తన పాలనను సీబీఐని నిషేధించి.. అడుగు పెట్టనీయకుండా చేసిన ఇదే చంద్రబాబు ఇప్పుడు సీబీఐ విచారణకు ప్రతీసారి డిమాండ్ చేస్తుండడం విశేషం.
వైఎస్ జగన్ సీఎం అవ్వగానే కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐని ఏపీలోకి అనుమతించారు. చంద్రబాబు ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తి వేశారు. చంద్రబాబు పాలనలో సీబీఐ దర్యాప్తు చేయాల్సిన ఆరు కేసులను తాజాగా రాష్ట్ర ఏసీబీ నుంచి సీబీఐకి జగన్ బదలాయించారు. సీబీఐ తాజాగా ఏపీకి తిరిగి చేరుకుంది. ఏసీబీ నమోదు చేసిన కేసులను స్వాధీనం చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు లంచం డిమాండ్ చేసిన రెండు కేసులు, సిండికేట్ బ్యాంక్ అధికారులు నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మరో రెండు కేసులు, సిజిఎస్టి విభాగం మరియు నావల్ డాక్ యార్డ్ అధికారులు లంచం డిమాండ్ కేసులను సీబీఐ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి ప్రకారం సీబీఐ ఈ కేసులను తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం నాడు నిషేధిస్తే ఇప్పుడు ఆ కేసులన్నింటిని జగన్ సర్కార్ సీబీఐకి అప్పగించి చంద్రబాబుకు షాకిచ్చారు. ఇందులో ఏం తేలుతుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
-నరేశ్ ఎన్నం