తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం మాజీ మంత్రి డి.కె. అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆశావహులు పోటీ పడ్డారు. చివరికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు.