కేంద్ర హోంశాఖకు ఎపి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఇటీవల రాసిన లేఖపై విచారణ జరుపుతున్న సిఐడి ఈ విషయంలో నేరుగా రమేష్ కుమార్ ను విచారించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
ఈ లేఖను తానే వ్రాసానని స్వయంగా రమేష్ కుమార్ ప్రకటన చేసినా, ఆ మేరకు రాష్ట్ర హై కోర్ట్ లో అఫిడవిట్ ను సమర్పించినా, కాదు దానిని టిడిపి కార్యాలయంలో తయారు చేసారని నిరూపించడం కోసం సిఐడి తంటాలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.
అంతే కాదు ఆ లేఖపై సంతకం చేసినది రమేష్ కుమార్ కాదని అంటూ వైసిపి ఎంపీ వి విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సిఐడి ఆ దిశలో పెద్దగా పురోగతి సాధించున్నట్లు కనబడటం లేదు.
వారం రోజుల వ్యవధిలో ఈ లేఖ విషయమై గతంలో నిమ్మగడ్డ వద్ద సహాయ పిఎగా పనిచేసిన సాంబమూర్తిని రెండు సార్లు సిఐడి బృందం విచారించడం గమనార్హం. ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్కుమార్ మెయిల్ ద్వారా కేంద్ర హోంశాఖకు పంపినట్లు గుర్తించారు.
అయితే ఆ లేఖను ఎవరు ప్రిపేర్ చేశారు?, ఆ వ్యక్తి ఐపి అడ్రస్ ఏంటి? అనే కోణంలో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. మొయిల్ నుంచి లేఖను నిమ్మగడ్డ డౌన్లోడ్ చేసుకున్నట్లు పిఎ సాంబమూర్తి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. లేఖను డౌన్లోడ్ చేసుకున్నాక హార్డ్డిస్క్ను క్లియర్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అనేకసార్లు విచారణ జరిపిన సిఐడి అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఏదో విధంగా నిమ్మగడ్డను, టిడిపికి మధ్య సంబంధాన్ని వెల్లడి చేయడం ద్వారా తాము ఆయనను పదవి నుండి అర్ధాంతరంగా తొలగించడంను సమర్ధించుకొనే ప్రయత్నం వైసిపి నేతలు చేస్తున్నారు. అందుకు సిఐడి ని సాధనంగా ఉపయోగించుకొంటున్నారు.