కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’కు దేశ వ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా దేశం మొత్తం స్తంభించిపోనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావడం గమనార్హం.
భారతావని కరోనాపై జరుపుతున్న సమరంలో అన్ని రాష్ట్రాలూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా తెలంగాణ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పిలుపుమేరకు ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు.
ఈ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులకు సంఘీభావంగా ప్రజలంతా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాల్సిందిగా పీఎం, సీఎంలు సూచించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో దేశంలో అన్ని నగారాలు, పట్టణాలలో జనమే లేక రహదారువులు అన్ని బోసి పోతున్నాయి.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు రవాణా వ్యవస్థపై ఆంక్షలు విధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో కోదాడవద్ద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు (హైదరాబాద్-విజయవాడ హైవే)ను సైతం ఆదివారం ఉదయం మూసేశారు.
మరోవంక మహారాష్త్రతో అన్ని సరిహద్దులను తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. మహారాష్ట్రతో ఐదారు వంద కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా.. పాట్నాలో 38 ఏళ్ల వ్యక్తి చికిత్స తీసుకుంటుండగా శనివారం(21)రాత్రి చనిపోయాడు. బీహార్ లో ఇది తొలి కరోనా మరణం .
వీరి మరణంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది. మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 2కు పెరిగింది. గత 24 గంటల్లో 10 కేసులు నమోదవ్వగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కు చేరింది. మహారాష్ట్ర(74), కేరళ (40), ఢిల్లీ (26), ఉత్తరప్రదేశ్ (24), తెలంగాణ (21)లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కాగా, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.