మనలో చాలామంది బాల్యంలోనే ఉన్నత చదువులు చదవాలని కలలు కంటారు. కొందరు ఆ కలలను నిజం చేసుకుంటే మరికొందరు వివిధ కారణాల వల్ల మధ్యలోనే చదువును ఆపివేస్తారు. కానీ ఆ చదువుపై ఉండే ఆసక్తి వల్ల, వివిధ కారణాల వల్ల జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత చదువుకోవాలని ఆశతో పరీక్షలు రాసే వాళ్లు ఎంతోమంది ఉంటారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్ర మంత్రి కాలేజీలో ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. అడ్మిషన్ తీసుకున్న మంత్రి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావడం గమనార్హం.
విద్యాశాఖ మంత్రి జగర్ నాథ్ మహ కేవలం పదో తరగతి వరకే చదివారు. కేబినెట్ విస్తరణలో ఆయనను మంత్రి పదవి వరించింది. ఆయనకు విద్యాశాఖ మంత్రిగా పదవి దక్కింది. అయితే ఆయన పదవి చేపట్టిన రోజు నుంచి ప్రతిపక్షాలు పదో తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి విధులు ఎలా నిర్వహిస్తాడని ప్రశ్నించాయి. ఇతర పార్టీల నేతల నుంచి వస్తున్న విమర్శలు జగర్ నాథ్ మహను ఎంతో బాధించాయి.
అయితే ఉన్నత చదువులు చదవలేదనే కారణం వల్లే తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని… ఆయన ఉన్నత చదువులు చదివి విమర్శించిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని భావించి అనుకున్నడే తడవుగా బోకారో జిల్లాలోని దేవి మహోతో కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. మంత్రి చదువుకు వయస్సుతో సంబంధం లేదని చదువును పూర్తి చేస్తానని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో పదో తరగతి చదివిన మంత్రి ఏం చేస్తాడని తనపై కొందరు విమర్శలు చేశారని అందువల్లే ఉన్నత చదువులు చదవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
https://twitter.com/Jagarnathji_mla/status/1292803271644467200