రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రభుత్వం తరుపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులు అమ్ముకోవడంతోనే ప్రభుత్వం నడపటం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారా అని ప్రశ్నించింది. ఏపీ పేద రాష్ట్రమేమి కాదని, వేల కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో ప్రజలు ధనవంతులుగా ఉంటే ప్రభుత్వం పేదరికంలో ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బిల్డ్ ఏపీ పథకం పేరుతో ప్రభుత్వం తొలివిడతగా గుంటూరు, విశాఖ నగరాల్లో ఉన్న విలువైన ఆస్తులు అమ్మకానికి పెట్టింది. ఈ నిధులతో బిల్ట్ ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. ఈ విషయాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ను హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి ఆక్షన్ జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసేందుకు సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు టిటిడి నిరర్ధక ఆస్తుల వేలంపై గుంటూరుకు చెందిన సురేశ్ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.