విశాఖలో ఎల్జి పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చింది. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కారణంగా, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాక పోవడం వల్లననే విషవాయువు ప్రయోగం అక్కడి ప్రజలపై జరిగిన్నట్లు నిగ్గు తేల్చింది.
లాక్ డౌన్ సందర్భంగా మెయిన్ టెనెన్స్లో నిర్లక్ష్యం, మానవతప్పిదాల ఫలితంగానే స్టెరీన్ గ్యాస్ లీక్ అయినట్టు ఎపి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బృందం స్పష్టం చేసింది. డాక్టర్ సరీన్, టి.సురేష్ నేతృత్వంలో ఈ సంస్థకు చెందిన బృందం గ్యాస్ లీక్ కు జరిగిన పరిణామాలపై లోతయిన దర్యాప్తు చేపట్టింది.
స్టెరీన్ స్టోరేజీ ట్యాంక్ లోపల ఆటో పాలిమరైజేషన్ ఇన్ హిబిటర్ని మిక్స్ చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అలాగే 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండేలా చూడడంలో అలసత్వం వహించారని ఈ బృందం నిర్ధారించింది. పైగా, సెల్ఫ్ పాలిమరైజేషన్ని నివారించేందుకు స్టెరీన్ గ్యాస్ని టెర్షియరీ బ్యుటైల్ కెటిచాల్ అనే కెమికల్లో కలపాల్సి ఉందని, కానీ లాక్ డౌన్ కాలంలో ఇలా జరగలేదని గుర్తించింది.
సెల్ఫ్ పాలిమరైజేషన్ క్రమంగా మొదలై కెమికల్ రియాక్షన్కి దారి తీసింది..దీంతో 150 డిగ్రీల సెంటీగ్రేడ్తో అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడింది అని ఈ నివేదిక తెలిపింది. దీనిని వెరిఫై చేయడానికి కంట్రోల్ రూమ్లో ఒక ఆపరేటర్ ఉండాలని, కానీ అక్కడ ఎవ్వరు లేరని వెల్లడి చేసింది. కూలింగ్ ప్రాసెస్ ని కూడా సరిగా నిర్వహించలేదని డాక్టర్ సరీన్ పేర్కొన్నారు.
మరోవంక, విషవాయువు కారణంగా ఎల్జి పాలిమర్స్ ఘటనలో స్టైరీన్ ప్రభావానికి గురైన వ్యక్తులు ఏడాది పాటు వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్షేత్రస్థాయిలో పర్యటించిన నిపుణుల బృందం స్పష్టం చేసింది. దీని పరిధిలోని 5 గ్రామాలు, 3 కిలోమీటర్ల పరిధిలో పండిన కూరగాయలు, పండ్లను వినియోగించరాదని హెచ్చరించింది. కనీసం అక్కడి గ్రాసాన్ని పశువులకు కూడా పెట్టవద్దని వారించింది.
విషవాయువు ప్రభావం పడిన మొక్కలను జివిఎంసి ద్వారా తక్షణమే తొలగించాలంది. తదుపరి నివేదిక వచ్చే వరకు స్థానిక పాల ఉత్పత్తులను వినియోగించరాదని సిఫార్సు చేసింది. తాగు, వంట కోసం బహిరంగ జల వనరులు వాడొద్దని హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాలను సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రపరచాలని సూచించింది. ప్రమాద ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించిన సిఎస్ ఐఆర్ఎన్ ఇఇఆర్ఐ నిపుణుల బృందం తమ నివేదికను కేంద్రానికి పంపించింది.