విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లు.. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే. నిజమే గతేడాది ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా రాబోతుందని వార్త రాగానే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఈ సినిమా గురించి ఆరా తీసింది. విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందని, పైగా నయనతారనే నిర్మాత అని తెలిసి.. ఇక ఈ సినిమా హిట్ గ్యారంటీ అనుకున్నారు అందరూ.
కట్ చేస్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి గానీ, ఈ సినిమా మాత్రం అతిగతి లేకుండా పోయింది. నయనతార నిర్మాత, పైగా ఆమెకు కాబోయే భర్త ఈ సినిమాకి దర్శకుడు, మరి అలాంటప్పుడు ఈ సినిమా ఎందుకు స్టార్ట్ కాలేదు, మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది అని ఎంక్వైరీ చేస్తున్నారు నెటిజన్లు. అయితే, ఈ సినిమా కథ విషయంలో విగ్నేష్ శివన్ కి కొన్ని అనుమానాలు ఉన్నాయని అందుకే సినిమాని ఆపేశాడని రూమర్లు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు వాస్తవం ఏమిటంటే.. ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ ను పెట్టడం దాంతో ఈ సినిమా ఈ ఏడాదికి పోస్ట్ ఫోన్ అవ్వాల్సి వచ్చింది. ఇక జనవరిలో హైదరాబాద్ లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు.
ఆ తరువాత షూటింగ్ కి మళ్ళీ మూడు నెలలు బ్రేక్ వచ్చింది, అంతలో సెకెండ్ వేవ్ వచ్చి పడింది. దాంతో ఈ సినిమా ఆగిపోయింది అంటూ రూమర్లు మొదలైపోయాయి. మరోపక్క విజయ్ సేతుపతి తమిళ్ తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా ఒప్పుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే సమంత కూడా ప్రస్తుతం బిజీగా ఉంది. ఒకేసారి విజయ్ సేతుపతి, సమంత, నయనతార డేట్స్ ఉంటేనే తరువాత షెడ్యూల్ మొదలవుతుంది. జులైలో ఈ ముగ్గురు పదిరోజులు పాటు ఈ సినిమాకి డేట్స్ ను ఇచ్చారట.