కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్ లో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కరోనా వైరస్ మానవజాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు. ఈ రోజుకి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని సీఎం తెలిపారు. భారత్ లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్ డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయని, తెలంగాణలో లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని కొనియాడారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామన్నారు.