ఏపీలో టీడీపీ పరిస్థితేంటో ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. జాతీయ పార్టీ అని బీరాలు పలికిన చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో టీడీపీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమవుతుందా…? అనే భయం పట్టుకుంది. పార్టీలో ఒకప్పుడు కీలక నేతలుగా ముఖ్య పాత్ర పోషించిన వారిలో కొందరిపై కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి కొందరు ముఖ్య నేతలు పార్టీలోనే ఉన్నా పార్టీ కార్యకలాపాలతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?
వీలైతే వైసీపీ లేదా బీజేపీలో చేరడానికి టీడీపీ కీలక నేతలు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ కంచుకోట కూలుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చాలా సంవత్సరాల నుంచి టీడీపీకి తిరుగులేదు. అయితే 2019 ఎన్నికల్లో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో రెండు సీట్లలో వైసీపీ విజయం సాధించగా విజయనగరం జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
విశాఖలో మాత్రమే టీడీపీ నాలుగు సీట్లలో విజయం సాధించి అంతోఇంతో బలంగా ఉంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు షాక్ ఇస్తూ వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే వాసుపల్లి గణేష్ టీడీపీకి షాక్ ఇవ్వగా మరో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీ లేదా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. గంటా కూడా పార్టీ మారితే మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలో చేరడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. నేతలు ఇతర పార్టీలకు మద్దతు తెలుపుతుండటంతో ఏపీలో టీడీపీ పుంజుకోవడం కష్టమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం