Telangana BJP : కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉండడం.. రాష్ట్ర నాయకత్వానికి ఎంతో మేలు చేస్తుంది. దేశానికి తాము అలా చేస్తున్నామని, రాష్ట్రాన్ని కూడా ఇలా చేస్తామని చెప్పుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడల్లా.. కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పిలిపించుకొని సభలు, సమావేశాలు నిర్వహించి.. ప్రచారం దండిగా చేసుకోవచ్చు. కానీ.. తెలంగాణ విషయంలో మాత్రం ఈ పరిస్థితి తారుమారవుతోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారంటే.. రాష్ట్రంలోని బీజేపీ (BJP) నేతలు హడలెత్తిపోయే పరిస్థితి తలెత్తింది. వారి పర్యటన ఉందని తెలిసిన దగ్గర్నుంచి.. వారు తిరిగి వెళ్లిపోయే వరకూ కనిపెట్టుకొని తిరుగుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. మరి, దీనికి కారణమేంటీ? అంతగా కంగారు పడాల్సిన పరిస్థితి ఏంటీ? అన్నది చూద్దాం.
ఉత్తర భారతాన్ని మొత్తం చుట్టేసిన కాషాయ పవనాలు.. దక్షిణాన్ని మాత్రం తాకలేకపోతున్నాయి. ఒక్క కర్నాటక మినహాయిస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా అవకాశాల్లేవు. తెలంగాణలో మాత్రం కాస్త అదును ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే.. ఇక్కడ కాషాయ సేద్యం చేయాలని, బీజేపీ పెంట పండించాలని ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ.. రాష్ట్ర నాయకుల ఆశలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ (CM KCR) నీళ్లు చల్లుతూనే ఉన్నారు. కేంద్రంలోని అవసరాలు, భవిష్యత్ ను దృష్టిలో బీజేపీ అధిష్టానంతో నడిపిస్తున్న రాజకీయాలు.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
దుబ్బాక విజయం, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లతో.. టీఆర్ ఎస్ పని అయిపోయినట్టేనని.. ఇక, రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతల దూకుడుకు.. ఒకే ఒక పర్యటనతో చెక్ పెట్టి, తన వ్యూహానికి ఉన్న పదును ఎంతో చాటిచెప్పారు కేసీఆర్. గ్రేటర్ ఫలితాల అనంతరమే ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్.. మోడీ (Prime Minister Narendra Modi), అమిత్ షా(Home Minister Amit Shah) వంటి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఫొటోలు దిగారు. మీడియాకు వదిలారు. ఏం మాట్లాడారన్నది మాత్రం బయటకు చెప్పలేదు. సీన్ కట్ చేస్తే.. బీజేపీ జోరు మాత్రం పూర్తిగా నార్మల్ కు వచ్చేసింది.
ఇటీవల మరోసారి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అనంతరం హోం మినిస్టర్ అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. శాలువాలు కప్పుకున్నారు. అభివాదాలు తెలుపుకున్నారు. దీంతో.. టీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటే అని ప్రచారం చేస్తున్న విపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరినట్టైంది. రాష్ట్రంలో యుద్ధం చేస్తున్నట్టుగా నటిస్తున్నారని.. కేంద్రంలో మాత్రం ఆలింగనాలు చేసుకుంటున్నారని.. ఈ రెండు పార్టీలూ ఒక్కటేనని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీ నేతలకు చాలా ఇబ్బందిగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులు.. తెలంగాణ సర్కారు పట్ల సానుకూలంగా వ్యాఖ్యానిస్తే తమకు మరింత ఇబ్బందులు వస్తాయని ఇక్కడి నేతలు భావిస్తున్నారట. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా.. ఏకంగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో లంఛ్ చేశారు. దీంతో.. రాష్ట్ర బీజేపీ నేతలు చాలా ఇబ్బంది పడ్డారు. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక.. లంచ్ కు వెళ్లొద్దని కూడా కోరారట. కానీ.. ముందుగానే నిర్ణయమైన కార్యక్రమం కావడం వల్ల సాధ్యం కాదంటూ.. ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు కేంద్ర మంత్రి. ఆ తర్వాత మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి, తాము టీఆర్ ఎస్ పై పోరాడుతున్నామని చెప్పాల్సి వచ్చింది.
ఇటీవల వచ్చిన మరో కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే పర్యటనలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. తెలంగాణ సర్కారుపై ఆమె ప్రశంసలు కురిపించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. వారం కింద పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి వచ్చినప్పుడు కూడా బీజేపీ నేతలు జాగ్రత్తపడ్డారట. ఈ విధంగా.. కేంద్రం నుంచి మంత్రులు వస్తున్నారంటే.. వారేం మాట్లాడుతారో? అది తమకు ఎలాంటి తంటాలు తెచ్చి పెడుతుందోనని.. తెలంగాణ బీజేపీ నేతలు కాచుకుని ఉంటున్నారట!