చైనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో దీని ప్రభావం కళాకారులపై తీవ్రంగా పడింది. ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి ప్రవేశించిన వారి కలలను లాక్డౌన్ చిధిమేసింది. రెండునెలలు షూటింగులు లేకపోవడంతో కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు తమకు సినిమాల్లో అవకాశాలు రావేమోననే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హిందీ చిత్రసీమకు చెందిన బుల్లితెర నటి, హోస్ట్ ప్రేక్ష మోహతా(21) ఆత్మహత్య చేసుకుంది. ప్రేక్ష మెహతా ‘క్రైమ్ పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరీ దుర్గ’ వంటి పలు టీవీ షోలతో పాటు అక్షయ్ కుమార్ చిత్రం ‘ప్యాడ్ మేన్’లో కూడా ఆమె నటించింది. ఆమె మృతితో హిందీ చిత్రసీమలో విషాదచాయలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై పలువురు నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో ఆమె ఇంటికే పరిమితమైంది. రెండున్నర నెలలు గడిచినప్పటికీ షూటింగులు ప్రారంభం కాకపోవడంతో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఆమె ఇన్స్టాలో ఓ మెసేజ్ పెట్టింది. ‘కన్న కలలు చనిపోయినప్పుడు.. జీవితం చెత్తగా ఉంటుందంటూ అందులో పేర్కొంది..’ అయితే ఆమె ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.