దేశంలో ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతేడాది నమోదైన కేసులతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ నిర్ధారణ అవుతుండటం గమనార్హం. కొందరిలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కరోనా నిర్ధారణ అవుతుంటే మరి కొందరిలో రెండో డోస్ వ్యాక్సిన్ తరువాత కరోనా నిర్ధారణ అవుతోంది.
వాస్తవానికి కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ కరోనా సోకినా లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత దాదాపు సంవత్సరం పాటు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సంవత్సరం తరువాత మళ్లీ కరోనా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎవరైనా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత పాజిటివ్ నిర్ధారణ అయితే కరోనా తగ్గే వరకు ఆగాలి. ఆ తరువాత కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి నెగిటివ్ వచ్చిన వాళ్లు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు. అయితే మద్యం అలవాటు ఉన్నవాళ్లు మాత్రం ఆ అలవాటుకు దూరంగా ఉంటే మంచిది.
చాలామంది భయం వల్ల కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అవి తాత్కాలికమే కాబట్టి కరోనా సోకకుండా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది.